టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన పూరిజగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినీ కెరీర్లో హిట్లు, ఫ్లాప్లు ఉన్నాయి. ఆయన తీసిన బద్రి, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి వంటి సినిమాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేర ఆకట్టుకోలేదనే చెప్పాలి.
తాజాగా పూరిజగన్నాథ్ బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పూరితో సినిమా చేయడానికి బాలయ్యకూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కోసం బాలయ్య టర్కీ వెళ్లాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మరోవైపు అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ చిత్రం యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరిజగన్నాథ్ సినిమా తీయనున్నట్టు తెలుస్తోంది.
పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా ఆడిపోయిది. లైగర్ ఫెయిల్యూర్తో నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమాకు ఎక్కువగా ఖర్చు పెట్టలేమని చెబుతున్నారట. దీంతో బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు పూరీ. దర్శకుడు పూరితో సినిమా చేసేందుకు బాలయ్య ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకే పూరి తన తరువాత సినిమాని బాలయ్యతో ఫిక్స్ చేసుకున్నాడట. అఖండ విజయం తర్వాత బాలయ్య వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. గతంలో పూరి-బాలయ్య కాంబోలో వచ్చిన పైసా వసూల్ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. మరోసారి వీరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.