నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఆహాలో చేసిన అన్స్టాపబుల్ షో సీజన్ 2 ఇటీవల ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్కి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ వచ్చిన విషయం తెలిసిందే. రెండో ఎపిసోడ్లో యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న ఈ యంగ్ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ బాగానే క్లిక్ అవుతోంది. ఈ ఎపిసోడ్కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవరనాగవంశీ కూడా హాజరయ్యారు.
ఈ యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ రచ్చ చేశారు. వారితో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో హీరో విశ్వక్ సేన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గతంలో పాగల్ సినిమా ప్రమోషన్ సందర్భంలో విశ్వక్సేన్ రోడ్డు మీద చేసిన ప్రమోషన్ బాగా వైరల్ అవ్వడంతో దానిపై నెగిటివ్ వార్తలు వినిపించాయి. విశ్వక్ సేన్ని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూకి పిలిచింది. మాట్లాడుతుండగానే మధ్యలోనే గొడవ జరగడంతో విశ్వక్ సేన్ని యాంకర్ దేవి నాగవల్లి స్టూడియో నుంచి బయటికి వెళ్లిపోవాలని చెప్పింది. దీంతో విశ్వక్ సేన్ బయటికి వచ్చేశాడు.
తాజాగా అన్స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్ దాని గురించి స్పందిస్తూ.. “నాకు తెలిసి ఇటీవల నాకు జరిగిన పెద్ద అవమానం అంటే అదే సర్. ఓ యాంకర్ టీవీ షోకి రమ్మని పిలిచి గొడవ పెట్టుకుంది. వాస్తవానికి అక్కడ నా తప్పు ఏం లేదు. కానీ అలాంటి వాళ్లతో మాట్లాడడం కంటే వెళ్లి పోవడం బెటర్ అని సైలెంట్గా లేచి వచ్చేశాను. ఆ విషయంలో ప్రేక్షకులు నాకు చాలా మద్దతు ఇచ్చారు. ఇక అప్పుడు నా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను” అని తెలిపాడు.