Srimanthudu Controversy: “శ్రీమంతుడు”తో పాటు “మహర్షి”… కాపీ కాంట్రవర్సీలో కొత్త మలుపు

Srimanthudu Controversy

“శ్రీమంతుడు” కాపీ కాంట్రవర్సీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలాగా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో రైటర్ శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన నవలను కాపీ కొట్టి “శ్రీమంతుడు” సినిమాను చిత్రీకరించినందుకు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై ఇంకా క్లోజ్ కాకముందే, తాజాగా రైటర్ శరత్ చంద్ర “మహర్షి”ని కూడా వదిలిపెట్టనంటూ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “శ్రీమంతుడు”. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ 2017 ఆగస్టు 7న రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి ఈ మూవీ కథ తనదేనంటూ రైటర్ శరత్ చంద్ర కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తున్నారు. ముందుగా నాంపల్లి కోర్టులో కేసు వేయగా కొరటాలపై చర్యలు తీసుకోవాలంటూ తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో, అనంతరం సుప్రీంకోర్టులో డైరెక్టర్ కొరటాల సవాల్ చేయగా, అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసులో శరత్ చంద్రకే అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఆయన నవలను కాపీ కొట్టి సినిమా తీసినందుకు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శరత్ చంద్ర స్పందిస్తూ ఇదే విషయంపై మహేష్ బాబుతో పాటు నవీన్ ఎర్నేనిలపై సుప్రీంకోర్టులో కేసు పెట్టబోతున్నట్టుగా వెల్లడించారు. అలాగే ఈ వివాదం నుంచి మహేష్ బాబును బయట పడేయడానికి నమ్రత ఎలాంటి ప్రయత్నాలు చేసిందో కూడా చెప్పుకొచ్చారు. ఇక డబ్బుతో ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా కొంతమంది సినీ పెద్దలు చెప్పారని, కానీ తను ఒప్పుకోలేదని శరత్ చంద్ర వెల్లడించారు. డైరెక్టర్ కొరటాల పబ్లిక్ గా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం ఇంకా పూర్తికానే లేదు, అంతలోనే “మహర్షి” సినిమా వివాదాన్ని స్టార్ట్ చేశారు శరత్ చంద్ర.

- Advertisement -

తాజాగా రైటర్ శరత్ చంద్ర “మహర్షి” సినిమా కూడా తన నవల నుంచి కాపీ కొట్టిందేనని ఆరోపించారు. ఒక్కసారి “శ్రీమంతుడు” ఇష్యూ సెటిల్ అయితే, ఆ తర్వాత “మహర్షి” సినిమాపై కూడా కాపీరైట్ విషయంలో లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు. తన నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టి “మహర్షి” సినిమాను తీశారని శరత్ చంద్ర చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. దీంతో ఈ కొత్త వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ఉత్కంఠత మొదలైపోయింది ఫిలింనగర్ వర్గాల్లో.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “మహర్షి”. 2019 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, అప్పట్లో హైయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే “శ్రీమంతుడు” కాపీరైట్ విషయంలో దర్శకుడితో పాటు నిర్మాతలు, హీరో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు “మహర్షి” కాపీ కాంట్రవర్సీతో ఎవరెవరు చిక్కుల్లో పడతారో చూడాలి. ఏదైతేనేం రైటర్ శరత్ చంద్ర ఇప్పట్లో మహేష్ బాబును వదిలిపెట్టేలా కనిపించడం లేదు

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు