ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్రస్తుతం తన కుమారులను హీరోలుగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సాయి శ్రీనివాస్ 2014లో అల్లుడు శ్రీనుతో టాలీవుడ్ కు అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబును హీరోగా పరిచయం చేయబోతున్నాడు.
లక్ష్మణ్ కె క్రిష్ణ దర్శకత్వంలో వస్తున్న స్వాతి ముత్యం అనే సినిమాతో బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై యువ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మూవీ యూనిట్ పోస్టర్లను రిలీజ్ చేసింది. తాజాగా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ట్రైలర్ ను చూస్తే.. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మధ్య పరిచయం.. అది ప్రేమ వైపు సాగే ప్రయాణం.. ప్రేమ పెళ్లి మధ్య జరిగే ఘటనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్లి చుట్టూ తిరిగిన విధంగానే కనిపిస్తోంది. హీరోయిన్ అందం, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. ట్రైలర్ ను బట్టి చూస్తే కామెడీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలవ్వనుంది. ఇప్పటికే దసరా పండుగ రోజు చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ చిత్రాలు విడుదలవుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతి ముత్యం సినిమా కూడా దసరాకే రాబోతుండడంతో ఒకే రోజు మూడు సినిమాలు విడుదలవ్వడం విశేషం.