ప్రతి ఒక్క దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళికి మహాభారతంను సినిమాగా తెరకెక్కించాలని డ్రీమ్. అలాగే మణిరత్నం డ్రీమ్ కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ను సినిమాగా చేయాలి. చాలా సంవత్సరాల తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇలా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. జన గణ మన అనే సినిమాను తెరకెక్కించడం తన జీవిత లక్ష్యమని పూరి చాలా సార్లు ప్రకటించాడు. ఈ జన గణ మన సినిమాను పూరి పట్టాలెక్కించడానికి ఇది వరకే ఒక సారి ప్లాన్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా ఫిక్స్ చేసి సినిమాను పక్కా గా రెడీ చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ వరకు వెళ్లలేకపోయింది.
కానీ ఇటీవల పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కు హీరో దొరికాడు. లైగర్ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండకు జన గణ మన స్టోరీ చెప్పడం, అది ఇద్దరికి నచ్చడం, వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవ్వడం, కొంత వరకు షూటింగ్ కూడా జరిగిపోయింది. అంతే కాదు.. ఒక పోస్టర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇంత హాడావుడి జరిగిన తర్వాత పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కు మోక్షం లభించిందని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. కానీ ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు.
పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ పై లైగర్ గట్టి దెబ్బెసింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ లైగర్ సినిమా కనీసం 100 కోట్లను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. పూరి గత సినిమాల్లో ఉన్న మార్క్ మాస్ లెవల్స్, హీరోయిజం, సెంటిమెంట్ తో పాటు చాలా వరకు లైగర్ లో కనిపించలేదు. దీంతో పూరి సినిమాలు చేయడం మానేయాలని, రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అంటూ విమర్శలు కూడా వచ్చాయి. వీటి ప్రభావం మొత్తం జన గణ మన పై పడింది.
విజయ్ దేవరకొండతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ రద్దు అయినట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రౌడీ హీరో కూడా ఒక సందర్భంలో “దాన్ని మర్చిపోవాలి” అంటూ కామెంట్ కూడా చేశాడు. అయితే జన గణ మన సినిమాను ముందుగా మహేష్ బాబుతో, ఇప్పుడు విజయ్ దేవరకొండతో షూటింగ్ స్టార్ట్ చేసిన సమయాల్లో పూరికి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కు మోక్షం వస్తుందా.. లేదా డ్రీమ్ గానే మిగిలిపోతుందా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మరో హీరోను పూరి దించుతాడో లేదో చూడాలి మరి.