Mr India : బాలీవుడ్ కల్ట్ మూవీ రీమేక్ కి సిద్ధం?

Mr India : టాలీవుడ్ లో గాని, బాలీవుడ్ లో గాని ఈ మధ్య రీమేక్ సినిమాలు తగ్గిపోయాయని తెలిసిందే. కొత్త తరహా సినిమాలు చేద్దామని కొందరు అనుకుంటుంటే, మరి కొందరు ఒరిజినల్స్ ని చెడగొట్టొద్దని వాటి జోలికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. కానీ కొంతమంది మేకర్స్ మాత్రం అలనాటి కల్ట్ మూవీస్ ని రీమేక్ చేయాలనీ ఉవ్విళ్లూరుతుంటారు. అలా తెలుగు లో కూడా కొన్ని సినిమాలను మేకర్స్ రీమేక్ చేయాలనీ చాలా సార్లు ప్లాన్ చేసినా కుదరలేదు. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి ని చరణ్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అలాగే ప్రభాస్ తో భక్త కన్నప్ప రీమేక్ కి ప్లాన్ చేస్తే అది మంచు విష్ణు చేస్తున్నాడు. అయితే ఇలాగే బాలీవుడ్ లో అలనాటి ఒక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ కాబోతుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కే కాదు ఇతర భాషల్లోనూ సగటు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్టర్ ఇండియా’.

38 ఏళ్ళ క్లాసిక్ రీమేక్ కి ప్లాన్..

అనిల్ కపూర్ శ్రీదేవి జంటగా నటించిన మిస్టర్ ఇండియా 1987లో రిలీజై సూపర్ ఫాంటసీ మూవీగా అప్పట్లో బాక్సాఫీస్ ని ఊపేసింది. శేఖర్ కపూర్ దర్శకత్వంలో బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించగా ఆ రోజుల్లో కనక వర్షం కురిపించింది మిస్టర్ ఇండియా. ఈ సినిమాలో చేతి వాచి కట్టుకుంటే అదృశ్యమయ్యే హీరో పాత్ర చుట్టూ అల్లిన డ్రామా, దానికి వాడిన గ్రాఫిక్స్ ఆ రోజుల్లో అబ్బురపరిచాయి. ఇక అనిల్ కపూర్, శ్రీదేవి జంట ఆడియన్స్ ని మైమరిపిస్తే, అమ్రిష్ పూరి విలనీ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. అయితే నాలుగు దశాబ్దాలకు దగ్గర పడుతున్న వేళ మిస్టర్ ఇండియా సీక్వెల్ కి బాలీవుడ్ లో అడుగులు పడుతున్నాయి. నిజానికి 2011 లోనే మిస్టర్ ఇండియా రీమేక్ ప్రయత్నం జరిగింది. అప్పటికి శ్రీదేవి బ్రతికే ఉంది. ఇక అదే జంటను రిపీట్ చేస్తూ సల్మాన్ ఖాన్ ని విలన్ గా పెట్టి ఏఆర్ రెహమాన్ సంగీతంతో మెగా బడ్జెట్ లో తీయాలని బోణి కపూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆలోచనైతే పుట్టింది కానీ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. ఇక ఇప్పుడు శ్రీదేవి, అమ్రిష్ పూరి, సతీష్ కౌశిక్ లాంటి కీలక తారాగణం లేరు. అయితే బోనీ కపూర్ మాత్రం రీమేక్ కి ఇప్పటికి రెడీ గా ఉన్నారు. అయితే ఇప్పుడు అనిల్ కపూర్ ని తండ్రి పాత్రలో పెట్టి కొడుకుగా రణబీర్ కపూర్ ని హీరోగా ఈ సినిమా చేస్తే ప్యాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయొచ్చని చర్చ నడుస్తుంది.

బోణి కపూర్ రెడీ?

అయితే ఈ సారి మాత్రం మిస్టర్ ఇండియా (Mr India) రీమేక్ ఖచ్చితంగా ఉంటుందని బోనీ బల్లగుద్ది చెబుతున్నారు. రీసెంట్ గా పలు ఇంటర్వ్యూ లలో కూడా బోణి కపూర్ మిస్టర్ ఇండియా రీమేక్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇక తనతో పాటు జీ సినిమాస్, వెస్ట్రన్ స్టూడియోస్ భాగస్వామ్యంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే క్యాస్టింగ్ గురించి మాత్రం వివరాలు చెప్పడం లేదు. బహుశా శ్రీదేవి బదులు జాన్వీ కపూర్ తల్లి ఐకానిక్ పాత్రను మళ్ళీ పోషిస్తే బాగుంటుందని అభిమానుల అభిప్రాయం. అయితే దీనిపై బోణి కపూర్ అన్ని పనులు పూర్తి చేసుకుని నటీనటులతో అఫిషియల్ గా ప్రకటిస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు