టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దసరా తరువాత రెండో షెడ్యూల్ ఉంటుందని ప్రకటించారు. అంతలోనే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ మరింత ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాని త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురానున్నట్టు ప్రణాళిక రచిస్తున్నారు. మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో అనన్య పాండే నటిస్తోందట. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
కానీ త్రివిక్రమ్ తన సినిమాలకు తారాగణాన్ని ఎంపిక చేసే విషయం కూడా చాలా ఆసక్తిగా ఉండడం విశేషం. దాదాపు 11 సంవత్సరాల తరువాత మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. SSMB 28 మూవీని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తే మాత్రం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.