టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు సినీ నిర్మాతలు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘కరోనా మహమ్మారి అనంతరం చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఖర్చులు, రాబడికి పొంతన లేకపోవడంతో సినీ నిర్మాతలు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ ఇది తెలుగు పరిశ్రమ నిర్మాతల గిల్డ్ చెబుతున్న వాదన.
ఈ నేపథ్యంలోనే సినిమాలను విడుదల చేసి, తీవ్రంగా నష్టపోతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. దీని నుండి సానుకూలమైన వాతావరణాన్ని తీర్చిదిద్దేందుకు నిర్మాతలంతా స్వచ్ఛందంగా ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు గిల్డ్ ప్రకటించింది. హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే, తమకు కొంత మేరకు అయినా, న్యాయం జరుగుతుందని నిర్మాతలు బహిరంగంగానే చెబుతున్నారు. గిల్డ్ ప్రకటనతో టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ తరుణంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఓ మెట్టు దిగివచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ రెమ్యూనరేషన్ ను 30 శాతం తగ్గించుకునేందుకు రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నిర్మాత దిల్ రాజ్ తో ఈ విషయాన్ని చెప్పినట్లు కూడా సమాచారం. అలాగే, ఈ ముగ్గురు హీరోల బాటలోనే మరికొంత మంది యంగ్ హీరోలు నడుద్దామని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు పుకార్లేనా, లేక నిజమా అనేది తేలాల్సి ఉంది. ఆగస్టు 1వ తేదీలోపు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.