టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో సత్యదేవ్ ఒకరు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ఫాదర్’ సినిమాలో విలన్ పాత్ర పోషించి తనదైన నటనతో అందరినీ మెప్పించాడు సత్యదేవ్. గాడ్ఫాదర్ సూపర్ సక్సెస్ సాధించడంతో ఇక వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం సత్యదేవ్- కన్నడ స్టార్ డాలీ ధనంజయతో కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాలసుందరం-దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిమినల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఓల్డ్ టైన్ పిక్చర్స్ బ్యానర్కి ఈ చిత్రం 26వది కావడం విశేషం. ఇందులో తమిళ నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్కి కూడా పరిచయమవుతోంది. ఇటీవల ఆమె ‘తిరు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించినప్పటికీ.. ఇది మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం కానుంది.
ఈ సినిమాలో ప్రియా ఫ్యాషన్ డిజైనర్గా కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఖరీదైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటించనున్నాడు. సత్యరాజ్ ని పరిచయం చేస్తూ తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. అందులో సత్యరాజ్ ఆన్ బోర్డు అని రాసి ఉండడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ కూడా ఈ సినిమా 26వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి చరణ్ రాజ్ సంగీతం అందిస్తుండగా.. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తుండగా.. అనిల్ క్రిష్ ఎడిగింట్ పనులను చూసుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఇతర ప్రముఖ నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.