దళపతి విజయ్- వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని గతంలో ద్విభాష చిత్రంగాను, తెలుగు చిత్రంగాను అనుకున్నారు. కానీ తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి అసలు విషయాన్ని చెప్పేశాడు. ఇది పక్కా తమిళ సినిమా అని, తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్టు వెల్లడించడం విశేషం.
తమిళ సినిమా అని చెప్పడంతో తెలుగు మార్కెట్ మీద దెబ్బ పడుతుందని కొందరూ అనుకుంటున్నారు. మరి కొందరేమో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కావడంతో సినిమాకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ విజయ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా దళపతి విజయ్ నుంచి అభిమానులు ఏం ఆశిస్తుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. వారిసు సినిమా తమిళ సినిమాయే అని ముందు నుంచి కూడా దిల్ రాజు హింట్ ఇస్తూనే వచ్చాడు. తెలుగు సినిమా షూటింగ్లు అన్ని బంద్ చేయాలని అన్నప్పుడు దిల్ రాజు వారిసు సినిమాను మాత్రం ఆపలేదు.
ఆ సమయంలో అందరూ అడిగితే ఇది తెలుగు సినిమా కాదని చెప్పుకొచ్చాడు. అప్పుడు అంతా దిల్ రాజుని ట్రోల్ చేశారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం. సినిమా ప్రారంభం రోజు మాత్రం పాన్ ఇండియన్ లెవల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ద్విభాష చిత్రంగా ఇది రాబోతుందంటూ చెప్పి.. ఇప్పుడు మాత్రం తమిళ సినిమా అనడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా 2023 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.