రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారాడు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటించే ప్రతీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడం విశేషం. సాహో, రాధేశ్యామ్ వంటి చిత్రాలు వచ్చినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయితే ప్రభాస్ తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతుందని ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు రికార్డుల గురించే ఆలోచిస్తున్నారు. ఇటీవల వచ్చిన పౌరాణిక సినిమాలు అన్ని కూడా భారీ స్థాయిలో వసూలు రాబడుతుండడంతో బాహుబలి తరువాత మరో సెన్షేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా సాహో, రాధేశ్యామ్ చిత్రాలు తీర్చలేని ఆకలిని ఆది పురుష్ తీరుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో దసరా పండుగ సందర్భంగా అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ ను భారీ స్టాయిలో ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ సినిమా టీజర్పై కామన్ ఆడియన్స్తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ‘ఆదిపురుష్’ టీజర్ యానిమేటెడ్ మాదిరిగా ఉందని, వీఎఫ్ఎక్స్ బాగోలేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది సాధారణ సినిమానా..? లేక బొమ్మల సినిమానా అని చాలా మంది సందేహ పడుతున్నారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొచ్చాడియాన్ సినిమాలాగే ఉందని.. ఆదిపురుష్ ఇలాగే ఉంటే కష్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ టీజర్లో ప్రభాస్ లుక్ కూడా అస్సలు బాగోలేదని అసంతృప్తి చెందుతున్నారు. కేవలం ఈ టీజర్లో రెండు పాజిటివ్ అంశాలు ఉన్నాయని, ఒకటి బీజీఎం అయితే, మరొకటి డైలాగులు అని అభిమానులు చెబుతున్నారు. ‘ఆదిపురుష్’ పుల్ యానిమేటెడ్ మూవీనా లేక సాధారణంగానే ఉంటుందా అనే విషయంపై మూవీ మేకర్స్ ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఆదిపురుష్ సినిమాకి హిందీ డబ్బింగ్ ప్రభాస్ చెప్పలేదని తెలుస్తోంది. నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట. గతంలో బాహుబలి సినిమాకు కూడా ప్రభాస్ పాత్రకు హిందీలో శరద్ కేల్కర్ వాయిస్ అందించడం విశేషం.