టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ సూపర్ హిట్గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా ఫహద్ ఫాసిల్, సునిల్, అనసూయ వంటి వారి కీలక పాత్రల్లో నటించిన సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ తరుణంలోనే ఈ సినిమా మీద భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కాల్సిన రెండో భాగం మీద దృష్టి పెట్టిన సుకుమార్ ఎలా అయినా ఈ సినిమాని ఓ రేంజ్లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అది ఏంటంటే సుకుమార్ మనసులో పుష్ప 3 ఆలోచన కూడా ఉందని అంటున్నారు.
ఇప్పటికే పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కాబట్టి పుష్ప సెకండ్ పార్ట్ కూడా కలెక్షన్లు భారీగా రాబడితే కనుక అప్పుడు మూడో భాగం తీసే అవకాశం ఉందని దీనిని సీక్వెల్స్ లా కాకుండా ఫ్రాంచైజ్ మార్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఒక రకంగా ఈ సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నా మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఇది బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉందని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
వాస్తవానికి పుష్ప తొలి భాగమంతా ఎర్రచందనం కాన్సెప్ట్ మీదనే నడుస్తుంది. పుష్పరాజ్ అనే సాదాసీదా కూలీ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నడిపే వ్యక్తిగా ఎలా ఎదిగాడనే విషయాన్ని చాలా ఆసక్తిగా చూపించారు. ఆ వ్యక్తి ఎదిగి ఎర్రచందనం సిండికేట్ ఓనర్ గా మారిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే విషయాన్ని రెండో భాగంలో చూపించబోతున్నారు. మూడో భాగంలో ఎలాంటి విశేషాలు చూపించబోతున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది.