తమిళ హీరో విజయ్ దళపతి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ని పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో చేతులు కలిపాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వారసుడు. ద్విభాష చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘వారసుడు’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్కి మంచి స్పందన రావడం విశేషం.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ప్రకటించింది. వారసుడు సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకున్నట్టు తెలిపింది. ఈ చిత్రం తెలుగు, తమిళ ఆడియో రైట్స్ కోసం ‘టీ సిరీస్’ దాదాపు రూ.10కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళంలో అత్యధిక రేటుకు అమ్ముడైన టాప్-5 మ్యూజిక్ ఆల్బమ్లలో వారసుడు ఆల్బమ్ ఒకటిగా నిలిచినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు హిందీలో కూడా వారసుడు చిత్రాన్ని విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం 2023 సంక్రాంతి పండుగ వరకు వేచి ఉండాల్సిందే.