సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటే తెలియని వారుండరు. ఆయన సినిమా విడుదలవుతుందంటే దేశవ్యాప్తంగా అభిమానులకు అదో ఉత్సాహం. సినిమా ఫలితం ఏవిధంగా ఉన్నా రజినీకాంత్ సినిమాను మాత్రం ఒక్కసారైనా చూస్తుంటారు ప్రేక్షకులు. తాజాగా రజినీకాంత్ ‘జైలర్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
జైలర్ సినిమాలో రజినీతో పాటు శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా రమ్యకృష్ణ, మిల్కిబ్యూటీ తమన్నాతో పాటు మరో కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా గెస్ట్ రోల్ లో మెరవనున్నారు. ఈ సినిమా కోసం రజినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి యంగ్ హీరోలకు పోటీగా రజినీ బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. లైకా ప్రోడక్షన్లో రజినీకాంత్ రెండు చిత్రాలను చేసేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు ప్రాజెక్టులు కూడా నవంబర్ 05న పూజా కార్యాక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని నిర్మాతలు సుభాస్కరన్, ప్రేమ్ శివస్వామి వెల్లడించారు. ఈ రెండు చిత్రాలు ఒకటేనా.. లేక వేర్వేరు చిత్రాలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ చిత్రాలకు దర్శకులు ఎవరన్నది కూడా ఇంకా స్పష్టత లేదు. ఇందులో ఒక సినిమాకి మాత్రం శిబు చక్రవర్తి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రజినీ, లైకా ప్రొడక్షన్ కాంబినేషన్లో రోబో 2.0 సినిమా తెరకెక్కింది. మరోవైపు తెలుగు దర్శకుడు వశిష్ట మల్లిడి రజినీకి ఓ కథ వినిపించినట్టు ప్రచారం అయిన విషయం తెలిసిందే.