50 Years for Alluri Seetharama Raju.. సాధారణంగా సినిమా అనేది నిజ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.. అయితే అందులో కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయా అన్న సందేహం కలుగుతుంది. ఇకపోతే కొన్ని పాత్రలలో నటించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేరాల్సిన వారికే అది చేరుతుంది.ఆ పాత్రే విప్లవ వీరుడు.. అల్లూరి సీతారామరాజు.. ఈ పాత్రను పోషించాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు.. కానీ చివరికి ఈ పాత్ర కృష్ణను చేరుకుంది.. టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా 1974 మే ఒకటిన విడుదల అయ్యి సంచలనం సృష్టించింది. ఇక నేటికీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాలోని డైలాగులు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారితున్నాయి .అవేంటో ఇప్పుడు చూద్దాం..
అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో అని కృష్ణను చూసి అందరూ అనుకున్నారు. అంతగా ఆ పాత్రలో నటశేఖరుడు కృష్ణ ఇమిడిపోయారు .ఇందులో గుమ్మడి, జగ్గయ్య, రాజనాల , కాంతారావు, చంద్రమోహన్, విజయనిర్మల వంటి పెద్ద పెద్ద నటులు నటించారు.. త్రిపురనేని మహారధి ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించగా వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా ఈ ఆదినారాయణరావ్ సంగీతం సమకూర్చారు.. అల్లూరి సీతారామరాజు చరిత్ర పూర్తిగా తెలుసుకొని కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు.. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు అల్లూరి పాత్రలోని జ్వాలను తెలియజేస్తాయి.. ఆ డైలాగులు వింటుంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండె రగిలిపోతుంది.. ఇక క్లైమాక్స్లో బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ స్కాట్ కోవార్డ్ (జగ్గయ్య) తో జరిగే మాటల యుద్ధంలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి. ఇక అందులో కొన్ని డైలాగులు ఇప్పుడు చూద్దాం..
బ్రిటిష్ సామ్రాజ్యం.. ఢిల్లీ బాద్ షా ల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం.. నెత్తిన గుడ్డల మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరురా తిరిగినప్పుడు ఎక్కడుంది.. గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరుపువెత్తినప్పుడు ఎక్కడుంది. ఎక్కడుంది రూథర్ ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం.
రూథర్ ఫర్డ్.. పొరపాటున కూడా అలా ఊహించవద్దు ఇది నా మాతృభూమి.. ఇక్కడి మట్టి పవిత్రం నీరు పవిత్రం.. గాలి పవిత్రం .. కొండలు , నదులు సమస్తము పవిత్రం.. ఈ జన్మకే కాదు వెయ్యి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను.. నా ప్రజలు సముచ్చరనకే పాటుపడతాను..
స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు.. పోరాడి గెలుచుకునే హక్కు.. రక్తమాంసాలు ధారబోసి రక్షించుకోవాల్సిన వరం.. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా వాయువులకి ఇచ్చే స్వరాజ్యం ..ఎక్కడ భయానికి చావు లేదో.. ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకొని తిరగగలడో ..ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో.. ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను.
ఆవేశం.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ రేయింబవళ్లు శ్రమించినా ఒక్క అరపూట అన్నానికి నోచుకోని నిర్భాగ్యులు నా ప్రజలు.. చాలీచాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్లు , తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక సమ్మసిల్లిపోయే పసిబిడ్డలు.. వాళ్లను చూసి ఆవేశపడక.. ఆవేదనపడక.. నీతో మంతనాలు చేయనా.. నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వ నాశనం చేసింది రూథర్ ఫర్డ్.. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది.. మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు.. మీ అధికారమంతమయ్యే వరకు ఆఖరి తలప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంతవరకు ఈ నిప్పుటేరులే ఈ రక్త వర్షాలే ఈ జీవన మరణ పోరాటమే..
ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.. ఒక్కొక్క విప్లవ వీరుడు విజృంభించి బ్రిటీష్ సామ్రాజ్యపు పునాధులు పెల్లగిస్తారు.. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు… సమూహ శక్తి..సంగ్రామ భేరి.. స్వాతంత్ర నినాదం..