టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి బెల్లకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతూ.. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రం స్వాతిముత్యం. ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా నటి వర్ష బొల్లమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
‘చూసి చూడంగానే’ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగుపెట్టి.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో అందరికీ దగ్గరైంది వర్ష బొల్లమ్మ. ‘స్వాతిముత్యం’ కథ నచ్చగానే సినిమాను ఒప్పేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. సహజత్వానికి దగ్గర ఉండే ఇలాంటి కథలు అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం కథ, కథనాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయని తెలిపింది. హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్’ చిత్రానికి ‘స్వాతిముత్యం’ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది బొల్లమ్మ. స్వాతిముత్యం సినిమాలో టీచర్ పాత్రలో నటిస్తున్నట్టు చెప్పింది.
ఇందులో తన పేరు భాగ్యలక్ష్మి అని, బయట కాస్త సరదాగా ఉన్నప్పటికీ పిల్లల ముందు కాస్త కఠినంగానే వ్యవహరిస్తానని వెల్లడించింది. ఈ సినిమాలో హీరో గణేష్ అద్భుతంగా నటించారని, ఈ చిత్రం గణేష్కి ఫస్ట్ మూవీలా అనిపించలేదని తన మనసులో మాటను బయటపెట్టింది. ముఖ్యంగా తనకు అవకాశం వచ్చిన ఏ పాత్రనైనా చేస్తాను. కాకపోతే ప్రేక్షకులు మాత్రం మధ్య తరగతి అమ్మాయిగా చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారనుకుంటున్నా. సైకో పాత్రలు, ప్రతినాయిక పాత్రలు దొరికితే బాగా చేయగలననే నమ్మకం నాకు ఉంది. ప్రస్తుతం సందీప్ కిషన్తో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది నటి వర్ష బొల్లమ్మ.