టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ వంటి నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కోసం జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇటీవలే ఓ కథను సిద్ధం చేసి వినిపించగా అందుకు ఓకే చెప్పారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తుండడంతో ఆ కథ రామ్ చరణ్కి సూటవ్వదని ఈ సినిమా ఆగిపోయింది.
తాజాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అదే కథను విజయ్ దేవరకొండకి వినిపించారట. అందుకు విజయ్ కూడా దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరోవైపు ఖుషి సినిమా తరువాత విజయ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న దిల్ రాజు ప్రాజెక్ట్ని విజయ్ ఒకే చేశారట. మొత్తానికి లైగర్ పరాజయం తరువాత హిట్ సాధించడానికి వరుస సినిమాలతో విజయ్ బిజీగానే ఉన్నాడని చెప్పవచ్చు. మరి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో వేచి చూడాలి.