త్రిష సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు గడుస్తోంది. అయినప్పటికీ ఆమె వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పీఎస్-1లో అందంతో ఆమె ఆకట్టుకుందనే చెప్పాలి. ప్రస్తుతం 10 ఏళ్లలోనే హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అయ్యే రోజుల్లో ఏకంగా 23 ఏళ్లు నిలదొక్కుకోవడం త్రిషకే దక్కిందనే చెప్పవచ్చు.
మధ్యలో సరైన విజయాలు అందుకోక జోరు తగ్గించినప్పటికీ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో కమ్బ్యాక్ అయింది. పీఎస్-1 త్రిష కెరీర్ను మరో మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. కుందవై యువరాణి పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం విజయంతో ఒక్కసారిగా మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. తాజాగా త్రిషకి రెండు భారీ అవకాశాలు వచ్చినట్టు తెలుస్తోంది.
వీటిలో ఒకటి దళపతి విజయ్ సినిమా కాగా.. మరోకటి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చిత్రంలో కూడా త్రిషను తీసుకున్నట్టు సమాచారం. విజయ్ 67 సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిషని ఎంపిక చేశారు. అదేవిధంగా అజిత్ 62వ చిత్రంలో కూడా త్రిషకి ఛాన్స్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలతో త్రిష కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.