కార్తికేయ -2 సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కేంద్ర మంత్రులు సైతం హీరో నిఖిల్ని ప్రశంసించారు. 2014లో తెరకెక్కిన కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టించింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ద్వారక నగరం ఇతివృత్తంగా సైన్స్ ఫిక్షన్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు మొండేటి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఒక్క సినిమాతోనే దేశం దృష్టిని ఆకర్షించాడు ఈ దర్శకుడు. దీంతో చందూకి వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చందు మొండేటీ తన తరువాత చిత్రాన్ని పాన్ ఇండియా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్టు సమాచారం.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ హీరోలతో తీయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ లేదా రణబీర్ కపూర్ నటించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా టాలీవుడ్కి చెందిన హీరో కూడా ఇందులో నటిస్తాడని.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.