సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తాత్కాలికంగా పెట్టారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఇక రెండో షెడ్యూల్ షూటింగ్ దసరా పండుగ తరువాత కొనసాగిస్తామని చిత్ర బృందం ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే.
దీంతో ఇక ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి కొద్ది రోజుల కిందటే వెకేషన్కి వెళ్లిన విషయం విధితమే. తాజాగా వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్కి చేరుకున్నారు. త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించే ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు ట్విట్టర్ లో ట్రెండింగ్ నడుస్తోంది. మరోవైపు నవంబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు కూడా తెలుస్తోంది.
దీంతో మహేష్ బాబు అభిమానులకు ఊపు వచ్చిందనే చెప్పవచ్చు. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది. ఈ చిత్రంలో మహేష్ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్న దానిని మించి ఉంటుందని చెప్పడం విశేషం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.