టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. కానీ అందులో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. టాలెంట్ ఉన్నప్పటికీ కొంత మంది రకరకాల సమస్యలతో ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొందరూ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వారికి సరైన హిట్స్ పడవు. మంచి గుర్తింపు లభించదు. అలాంటి నటుల్లో మంచి టాలెంట్ ఉన్న యువ నటుడు సత్యదేవ్ ఒకరు.
తొలుత చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తరువాత ఛార్మి నటించిన జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా మారాడు. ముఖ్యంగా జ్యోతిలక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్ర కోసం దాదాపు 500 మందికి పైగా కళాకారులకు ఆడిషన్ నిర్వహించగా.. అందులో సత్యదేవ్ ఎంపికయ్యాడు. 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలో ఉమా మహేశ్వరరావుగా నటించి మంచి గుర్తింపునే సంపాదించారు. ఈ మధ్య కాలంలో అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు.
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో కూడా సత్యదేవ్ ఓ అతిథిగా పాత్రలో కనిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమాలో నటించాడు సత్యదేవ్. ఈ సినిమా అతనికి సూపర్హిట్ని అందించిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా గాడ్ఫాదర్ విడుదలకు ముందు సీనియర్ నటుడు చిరంజీవి ముందు యంగ్ హీరో సత్యదేవ్ నిలవగలడా అన్న సందేహాలు ఉండేవి. విడుదలైన తరువాత సత్యదేవ్లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అని అనకుండా ఎవ్వరూ ఉండలేరు. గాడ్ఫాదర్ సినిమాలో కొన్ని సీన్లలో మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేశాడు సత్యదేవ్. ఇక సత్యదేవ్కి ముందు ముందు మంచి క్యారెక్టర్లు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.