Prabhas : విడుదలకు ముందే..

ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు ఓ సెన్సేషన్. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. బాహుబలి తర్వాత సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు ప్రభాస్. సినిమా అంతంత మాత్రం గానే ఉన్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం మారుమోగిపోయాయి. దానికి ఒకే ఒక కారణం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన “రాధేశ్యామ్” అంచనాలను అందుకోలేకపోయినా.. దేశవ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం డార్లింగ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజికల్ మూవీ “ఆది పురుష్”. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను ప్రభాస్ కు దగ్గరైన యు.వి క్రియేషన్స్ సంస్థ 100 కోట్ల రూపాయలకు దక్కించుకుందని సమాచారం.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు