నందమూరి బాలకృష్ణ హీరోగా గత ఏడాది విడుదలైన అఖండ సినిమా బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అఖండ ఘన విజయం తరువాత హీరో రామ్ తో దర్శకుడు బోయపాటి శ్రీను ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
వాస్తవానికి ఈ సినిమాని తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉందట. అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కథను తొలుత బన్నికి చెప్పాడట. అల్లు అర్జున్ కూడా ఈ కథకి ఓకే చెప్పాడట. కానీ వరుస కమిట్ మెంట్ల కారణంగా డేట్లు ఇవ్వలేకపోయారట బన్ని. దీంతో ఇదే కథతో రామ్ పోతినేనితో సినిమాను ప్రారంభించినట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోయపాటి శైలి మాస్ యాక్షన్ హంగులతో రూపొందనున్నట్లు సమాచారం. బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కబోయే ‘RAPO 20’ చిత్రంలో రామ్ సరసన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మొత్తానికి ఐకాన్ స్టార్ నుంచి వచ్చిన కథ రామ్ కి ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాలి మరి.