తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటి రమ్యకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఆమెను నటిగా కీర్తిస్తుంటారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహా సినిమాలో నీలాంబరి పాత్ర పోషించింది. ఇక అప్పటి నుంచి బహుభాష నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. బాహుబలి సినిమాలో నటించి ఆమె మరింత ఇమేజ్ని సంపాదించుకుంది.
మొట్టమొదటిసారిగా రమ్యకృష్ణ ఓటీటీలో డ్యాన్స్ రియాలిటీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆహాలో డ్యాన్స్ ఐకాన్ షో ప్రారంభం అయింది. ఈ ప్రీమియర్ ఆదివారం ప్రసారం అయింది. సెప్టెంబర్ 17 నుంచి ప్రతీ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఆహా ఓటీటీలో ప్రసారమవ్వనుంది. మరోవైపు శేఖర్ మాస్టర్, టెలివిజన్ టాప్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ సైతం ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జీగా ఆరంగేట్రమ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు రమ్యకృష్ణ. ఈ షో ద్వారా ఎవ్వరూ చూడని ఓ కొత్త రమ్యను అందరూ చూడబోతున్నారని తెలిపింది. ఇక రొటిన్ డ్యాన్స్ షోస్కి భిన్నంగా రూపుదిద్దుకుంటున్న డ్యాన్స్ ఐకాన్ షో ఏ స్థాయి ఆదరణ పొందుతుందో చూడాలి మరి.