కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదల తేదీ రోజు రోజుకు దగ్గరపడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే లిరికల్ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రాచ్ఛస మావయ్య అనే సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు. కార్తీ, త్రిష, శోభిత ఇందులో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మత్తెక్కిటు వస్తున్నావా.. పెద్దత్తకు నిన్నొత్తి గిల్లి బుద్ది కొంచెం ఇస్తా అంటూ ప్రారంభమైన ఈ సాంగ్ తెగ ఊపును తీసుకొస్తుంది. రాచ్చస మావయ్య.. రాత్రి వేళ సూర్యుడా.. నీ చచ్చు బుద్ది మారదా అంటూ శ్రీకృష్ణుడి గెటప్లో శోభితా దూళిపాళ్ల పాడుతుండగా.. రాక్షసుడు గెటప్లో కార్తి దర్శనమిచ్చాడు.
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ వినసొంపైన పదాలు అందించారు. శ్రేయ ఘోషల్, శంకర్ మహదేవన్, మహేష్ వినయక్రమ్ మెస్మరైజ్ వాయిస్తో ఆలపించారు. ముఖ్యంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 30 వరకు వేచి ఉండాల్సిందే.