టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. టాలీవుడ్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి వసూళ్లను సాధించింది.
కృష్ణుడి కంకణం కోసం ఓ యువకుడు సాగించిన ప్రయాణానికి అడ్వెంచరస్ థ్రిల్లింగ్ అంశాలను జోడించి దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 2014లో తెరకెక్కిన కార్తికేయ సినిమాకు రీమెక్గా వచ్చింది. కార్తికేయ సినిమా కంటే ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కేంద్ర హోంమంత్రి సైతం హీరో నిఖిల్ను కలిశారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన కార్తికేయ 2 దసరా రోజున సందడి చేయబోతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ5 సంస్థ దక్కించుకుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరోవైపు కార్తీకేయ 2 మూవీ మలయాళంలో సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో థియేటర్లు లభించినట్టు సమాచారం. దసరాకి వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగవైభవంగా కూడా ఓటీటీలో విడుదలవుతోంది. థియేటర్లో భారీ హిట్ అందుకున్న కార్తీకేయ 2 దసరా పండుగ రోజు ఓటీటీలో ఎలా అలరించనుందో అనేది వేచి చూడాలి.