కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్శెట్టి తెరకెక్కించిన సినిమా కాంతార. ఈ సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ బడ్జెట్ సినిమాల రికార్డులను సైతం తిరగరాస్తోంది. మొదట కన్నడలోనే విడుదల చేశారు. అక్కడ సూపర్ హిట్ కావడంతో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేసి మార్కెట్ని పెంచేశారు నిర్మాతలు. దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా అద్భుతమంటూ కొనియాడుతున్నారు.
తాజాగా ఈ సినిమాను చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రసంశల వర్షం కురిపించింది. ఆమె సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. ‘ఇప్పుడే కుటుంబంతో కలిసి కాంతార సినిమా చూశాను. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇందులో సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మెళనమే ఈ కాంతార చిత్రం. రిషబ్ శెట్టికి హ్యాట్సాప్. అద్భుతంగా నటించాడు.
అదేవిధంగా ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఇలాంటి చిత్రాన్ని తాము ఎప్పుడూ చూడలేదని థియేటర్ లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించిన టీమ్ ధన్యవాదాలు. మరో వారం రోజుల పాటు నేను అనుభూతితోనే ఉంటాననిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. మరోపోస్ట్ షేర్ చేస్తూ వచ్చే ఏడాది కాంతార నామినేట్ అవ్వడం పక్కా అని పేర్కొంది కంగనా రనౌత్. ఇంతకంటే గొప్ప చిత్రాలు రావచ్చు కానీ మన దేశ సంస్కృతినీ, అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే కాంతార వంటి చిత్రాలను తప్పకుండా ఆస్కార్కి నామినేట్ చేయాల్సిన అవసరం ఉందని కంగనా పేర్కొంది.