తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జై భీమ్, ఈటీ వంటి సినిమాల్లో సూర్య నటించారు. జైభీమ్ సూపర్ హిట్ సాధించి చాలా అవార్డులను గెలుచుకుంది. జై భీమ్ సినిమాని టీ జే జ్ఞానవేల్ తెరకెక్కించారు. సూర్య, జ్యోతికలు నిర్మాతలుగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా అందరి మన్ననలను పొందింది. గోవాలో జరుగబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ పనోరమా విభాగంలో జైభీమ్ చిత్రం అధికారికంగా ఎంపిక అయింది. ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. జైభీమ్ తరువాత భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ‘ఈటీ’ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది.
ప్రస్తుతం ‘సూర్య 42’ పేరుతో శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ప్రమోద్ స్టూడియో గ్రీన్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కోలీవుడ్కి పరిచయమైంది. సూర్య 42 చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ అందరినీ మెప్పించింది. దాదాపు 10 భాషల్లో విడుదలవుతుందని ‘సూర్య 42’ మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే మరోసారి జైభీమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. సూర్య, జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ జతకట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జైభీమ్ సినిమా సమయంలోనే సూర్యకి ఒక లైన్ని వివరించినట్టు దర్శకుడు జ్క్షానవేల్ ఓ యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట డైరెక్టర్ జ్ఞానవేల్. 2023లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మరోసారి జైభీమ్ కాంబినేషన్ రిపీట్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.