Prathindhi2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 మూవీ చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా వరుస ప్లాప్ లలో ఉన్న ఈ హీరో సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో రీ ఇస్తున్నాడు. పదేళ్ల క్రితం రిలీజైన ప్రతినిధి సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి2 సినిమా తెరకెక్కడం జరిగింది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వవహించడం జరిగింది. ఇక ఈ మూవీలో నారా రోహిత్, సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్రలో అలరించనున్నారు. నిజానికి గత నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మేకర్స్ ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. పదేళ్ల క్రితం ప్రతినిధి సినిమా కూడా అదే తేదీన రిలీజ్ అయింది. కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడం వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రతినిధి..
ఇక ప్రతినిధి2(Prathindhi2) సినిమా మే 10 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఎలెక్షన్ల పోలింగ్ కు మూడు రోజుల ముందే ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ట్రైలర్ లో ‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓట్లు వేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అది కూడా కుదరకపోతే చచ్చిపోండి’ అనే డైలాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ప్రతినిధి2 సెన్సార్ బోర్డు నుంచి మూవీ యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక సినిమా రన్ టైమ్ 136 నిమిషాలుగా (2 గంటల 16 నిమిషాలు) ప్రకటించారు.
ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?
ఇక ఈ సినిమా సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రతినిధి-2 మూవీ రిలీజ్ కు అంతా రెడీ అన్నమాట. ఇక ఈ మూవీని వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫిమేల్ లీడ్ రోల్ లో సిరి లెల్లా నటించారు. ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్ గుప్తా, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి, దినేష్ తేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుత ఎన్నికలపై ప్రభావం ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సినిమా చూసే వారు చాలా తక్కువ అని అంటున్నారు.