దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తరువాత సినిమా ప్రకటించారు. ఇటీవలే ఆ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు అవకాశం ఉన్న ఈ సినిమా భారీ స్థాయిలోనే రూపొందించనున్నట్టు సమాచారం. ప్రపంచాన్ని చుట్టూ ఓ సాహసికుడి చుట్టూ ఈ సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాటు హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ చిత్రానికి హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా రాబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. రాజమౌళి తన ప్రాజెక్ట్ ను గ్లోబల్ లెవెల్ లో తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. మరోవైపు మహేష్ తో తీసే సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా ఏకకాలంలో షూటింగ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
విజయదశమి లోపు పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈచిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకునే ను ఎంపిక చేసినట్టు కూడా ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. దీపిక గతంలోనే ఎక్స్ఎక్స్ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది. ఆమె ఈ చిత్రంలో నటిస్తే కొంత హెల్ప్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినట్టు సమాచారం. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ షూటింగ్లో పాల్గొననున్నట్టు సమాచారం.