Undekhi on OTT : ఇటీవల కాలంలో పైరసీ గోల ఎక్కువైంది. సినిమాలు అలా థియేటర్లలోకి వచ్చేస్తున్నాయో లేదో ఇలా పలు సైట్స్ లో దర్శనం ఇస్తున్నాయి. ఇక ఓటీటీ గురించి చెప్పక్కర్లేదు. ఏ మూవీ, సిరీస్ రిలీజ్ అయినా వదలట్లేదు లీకు రాయుళ్ళు. తాజాగా ఈ పైరసీ బాధను తట్టుకోలేక అన్ దేఖి సిరీస్ మేకర్స్ కోర్టు మెట్లెక్కారు.
అసలు సమస్య ఏమిటంటే?
సోనీ లివ్ లో ప్రసారం అవుతున్న పాపులర్ వెబ్ సిరీస్ ‘అన్ దేఖి ‘ 2 సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యాయి. మేకర్స్ ఇటీవలే మూడవ సీజన్ను విడుదల చేశారు.
‘అన్ దేఖి సీజన్ 3’కి కూడా సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. కానీ అంతలోనే కొన్ని వెబ్సైట్లు దానిని ఇల్లీగల్ గా ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఈ సిరీస్ నిర్మాతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
క్రైమ్ సిరీస్ అన్ దేఖి సీజన్ 3 కి అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను చూసి నిర్మాతలు సంతోషించారు. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. చాలా వెబ్సైట్లు ఈ సిరీస్లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడమే నిర్మాతలను ఇబ్బందులకు గురి చేసింది. ఈ ఇల్లీగల్ స్ట్రీమింగ్ కారణంగా నిర్మాతలు చాలా నష్టపోయినట్టు తెలుస్తోంది. దీంతో సిరీస్ ను నిర్మించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో షో విడుదలైన వెంటనే, అది అక్రమ వెబ్సైట్లలో లీక్ అయిందని హైకోర్టును ఆశ్రయించారు.
ఆ సైట్స్ అన్నీ బ్లాక్
ఢిల్లీ హైకోర్టు నిర్మాతలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నమోదు చేసిన ఈ కేసు కింద క్రైమ్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అన్ దేఖి’ని చట్టవిరుద్ధంగా ప్రసారం చేసే, డౌన్లోడ్ చేసే అన్నీ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించింది.
మే 20న జస్టిస్ సంజీవ్ నరులా జారీ చేసిన ఉత్తర్వు చట్టవిరుద్ధమైన వెబ్సైట్లను బ్లాక్ చేయడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP), ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు సాంకేతిక శాఖను ఆదేశించింది.
కోర్టు తన ఉత్తర్వుల్లో ఏం చెప్పింది?
‘అన్ దేఖి’ నిర్మాతల అనుమతి లేకుండా ప్రతివాదులు లేదా వారి తరపున ఎవరైనా సిరీస్ను ప్రసారం చేయడం, హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడం లేదా వీక్షించడం/డౌన్లోడ్ చేయడం నిషేధించబడుతుందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చట్టవిరుద్ధమైన వెబ్సైట్లు చేస్తున్న కాపీరైట్ ఉల్లంఘనను కూడా కోర్టు తన ఆర్డర్లో ప్రస్తావించినట్టు సమాచారం.
‘అన్ దేఖి’ కథేంటి?
‘అన్ దేఖి’ కథ హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో నివసిస్తున్న అత్వాల్ కుటుంబానికి సంబంధించినది. ఈ కుటుంబ పెద్దని అందరూ పాపాజీ అని పిలుస్తారు. అతని చుట్టూనే తిరుగుతుంది కథ. క్రైమ్, సస్పెన్స్తో నిండిన ఈ సిరీస్కి ఆశిష్ ఆర్ శుక్లా దర్శకత్వం వహించారు. హర్ష్ ఛాయాతో పాటు, దివ్యేందు భట్టాచార్య, అంకుర్ రాఠి, సూర్య శర్మ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. దీని మూడవ సీజన్ మే 10న విడుదలైంది.