లోకేష్ కనగరాజ్ తీసినవి మూడు సినిమాలే అయినా,
ప్రతి సినిమాలో తన మార్క్ ఉంటుంది. మా నగరం సినిమాతో తమిళ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్, తెలుగులో కూడా సుపరిచితుడు.
2019లో కార్తీ హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా “ఖైదీ”. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఈ ప్రాజెక్ట్ తరువాత ఇళయదళపతి విజయ్ హీరోగా , విజయ్ సేతుపతిని విలన్ గా పెట్టి మాస్టర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ ను చేసాడు లోకేష్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమాకి కూడా మంచి కలక్షన్స్ వచ్చాయి. లోకేష్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ కి పోటీగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2018లో విశ్వరూపం తర్వాత కమల్ హాసన్ చేస్తున్న సినిమా ఇది.ఆయన చేసిన భారతీయుడు 2 సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయిన సంగతి తెలిసిందే.
“విక్రమ్” ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్పై ఆర్.మహేంద్రన్తో కలిసి కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి “పతల పతల” సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేయనున్నారు.