టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్ను మూసిన విషయం తెలిసిందే. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణంరాజు మరణంపై స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహోన్నత కళాకారుడికి మహోన్నత వీడ్కోలు అందించాలని పేర్కొంటూ వరుస ట్వీట్స్ పెట్టి సంచలనం సృష్టించారు వర్మ.
రెబల్ స్టార్ కృష్ణంరాజు లేరనే వార్తను తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ లోకం జీర్ణించుకోలేక పోతుంది. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పలువురు సినీ నటులతో పాటు ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం అంటూ తొలి ట్వీట్ వదిలిన వర్మ. దానికి కొనసాగింపు ట్విట్స్ వదులుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుందని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది అని గతం తవ్వుతూ ఫిటింగ్ పెట్టారు వర్మ. ముఖ్యంగా కృష్ణ, మురళిమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ తదితర హీరోలకు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.