Meiyazhagan : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోగా మంచి అభిమానులను సంపాదించుకున్న హీరో కార్తీ. సూర్య తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అభిమానులని సంపాదించాడు. ఇక తమిళ్, తో పాటు తెలుగులో కూడా సమానమైన అభిమానులను సంపాదించుకున్న స్థాయి హీరో కార్తీ. ఇక రెండేళ్ల కింద పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో భారీ హిట్లు సాధించిన కార్తీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో జపాన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కార్తీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా కార్తీ ’96’ డైరెక్టర్ ప్రేమ్కుమార్ కాంబోలో ఓ చిత్రం చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది.
ఇంట్రెస్టింగ్ గా కార్తీ మూవీ ఫస్ట్ లుక్..
ఇక కార్తీ హీరోగా నటించబోయే కొత్త సినిమాకు ప్రేమ్కుమారే సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ, స్క్రీన్ప్లే, డైలాగ్లు కూడా రాస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కార్తీ అన్న, వదినలైన జ్యోతిక, సూర్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కార్తీ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇక కార్తీ, ప్రేమ్కుమార్ కాంబోలో వస్తున్న సినిమాకు ‘మెయ్యళగన్’ (Meiyazhagan) అనే పేరును ఖరారు చేశారు. కార్తీ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో సీనియర్ నటుడు అరవింద్ స్వామి సైకిల్ను తొక్కుతుండగా.. కార్తీ వెనుక కూర్చుని హాయిగా నవ్వుతున్నాడు. మరో పోస్టర్లో కార్తీ ఎద్దును పట్టుకున్నాడు. సినిమా పేరు, ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్తీ పుట్టినరోజు సందర్భంగా ‘మెయ్యళగన్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్లుక్కి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
షూటింగ్ చివరిదశలో కార్తీ సినిమా..
ఇక ‘మెయ్యళగన్’ సినిమాలో అరవింద్ స్వామి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న స్నేహ బంధం అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రంలో రాజ్కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ, రాజ్కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ నటించారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కుంభకోణం, శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది. ప్రస్తుతం ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ జపాన్ తో ప్లాప్ అందుకున్న కార్తీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అలాగే ఇదే ఏడాది సర్దార్ 2, ఖైదీ2 సీక్వెల్స్ ని కూడా పట్టాలెక్కించనున్నాడు.