BJP Central Minister : నిన్న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే తనకు మంత్రివర్గంలో చోటు దక్కడం లేదని, సహాయ మంత్రిగా పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీగా పని చేయాలనుకుంటున్న తన కల నెరవేరకపోవడంతో మోడీకి షాక్ ఇస్తూ సురేష్ గోపి రిజైన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
మోడీకి షాక్
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత సురేష్ గోపి మంత్రి పదవి నుండి వైదొలగాలని కోరుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మొదలైంది. నటుడి నుంచి రాజకీయ నాయకుడుగా మారిన సురేష్ గోపి తనకు పదవి నుండి విముక్తి పొందాలని ఉందని, త్రిస్సూర్ ప్రజల కోసం ఎంపీగా పని చేయాలని కోరుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఒక ఎంపీగా తాను త్రిసూర్ కు సేవలు అందిస్తానని, తనకు కేబినెట్ పదవి అక్కర్లేదనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది.
రెండు రోజుల తరువాత మీడియా సమావేశం
జూన్ 10న ఆయన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడని తెలుస్తోంది. రెండు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడతానని సురేష్ గోపి అన్నారని టాక్. కేరళలో బీజేపీ నుంచి గెలిచిన తొలి లోక్సభ ఎంపీ సురేష్ గోపీ కావడం విశేషం.
ఆయన టెన్షన్ అంతా ఇదేనా?
సురేష్ గోపీ ప్రకటన తర్వాత ఆయన మంత్రిగా కొనసాగుతారని బీజేపీ చెబుతోంది. సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి నచ్చజెప్పారని తెలుస్తోంది. సురేశ్ గోపీ తన సినిమాల గురించి ఆందోళన చెందాడని బీజేపీ అంటోంది.
త్రిసూర్ నుంచి ఎంపీగా
కేరళలోని త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీని విజయపథంలో నడిపించిన సురేష్ గోపీకి ఎన్నికల్లో 4 లక్షల 12 వేల 338 ఓట్లు వచ్చాయి. కాగా సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్కు 3 లక్షల 37 వేల 652 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్కు చెందిన మురళీధరన్ 3,28,124 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కానీ దక్షిణాది రాష్ట్రమైన కేరళలో మాత్రం కాంగ్రెస్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇక్కడ 20 స్థానాలకు గానూ కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకుంది.
కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేష్ గోపి
కేరళలో బీజేపీ ఎదుగుదలలో సురేష్ గోపి కీలక పాత్ర పోషించారు. కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేష్ గోపినే కావడం గమనార్హం. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్న గోపీ ఇప్పుడు లోక్సభ ఎంపీగా మారారు. కాగా ఇప్పుడు ఆయన పేరులో మంత్రి పదం కూడా చేరింది. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న త్రిసూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సురేష్ గోపీ విజయం సాధించి, కేరళ నుంచి తొలి బీజేపీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో గోపీ తన అభ్యర్థిత్వాన్ని ‘త్రిసూర్కు కేంద్ర మంత్రి మోడీ హామీ’ అనే నినాదంతో భారీగా ప్రచారం చేశారు.