Turbo Story Revealed : మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ కామెడీ చిత్రం టర్బో. వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 23న వెండి తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమా కథ నిజ జీవితంలో జరిగిన స్కామ్తో ప్రేరణ పొందిందని మీకు తెలుసా?
టర్బో స్టోరీ ఇదే..
టర్బో మూవీ స్టోరీ కథానాయకుడు జోస్ చుట్టూ తిరుగుతుంది. ఇడుక్కికి చెందిన టర్బో జోస్ అనే జీప్ డ్రైవర్ పరిస్థితుల కారణంగా చెన్నైకి పారిపోవాల్సి వస్తుంది. అయితే వెట్రివేల్ షణ్ముగ సుందరం అనే వ్యాపారవేత్త నిర్వహించే పెద్ద ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడంతో అతని జీవితం చెన్నైలో మలుపు తిరుగుతుంది. టర్బో జోస్ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు అనేది టర్బో మూవీ కథాంశం.
టర్బో స్టోరీ రివీల్ చేసిన రచయిత
ఇటీవలి ప్రచార కార్యక్రమంలో చిత్రం విడుదలకు ముందు రచయిత మిధున్ మాన్యువల్ థామస్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అతను టర్బో కథ నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిందని పేర్కొన్నాడు.
ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ రచయిత మిధున్ మాన్యువల్ థామస్ ఈ సినిమా కథ నిజ జీవితంలో జరిగిన స్కామ్ ఆధారంగా తెరకెక్కింది అని పేర్కొన్నారు. వాస్తవానికి మిధున్ మాన్యువల్ థామస్ తనకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తికి ఇది జరిగిందని చెప్పి షాక్ ఇచ్చాడు. అంతేకాదు రచయిత-దర్శకుడు మమ్ముట్టికి కథ చెప్పినప్పుడు మలయాళ మెగాస్టార్ వెంటనే ఆ స్కామ్ను గుర్తు పట్టారు అంటూ చెప్పుకొచ్చారు. నిజ జీవిత సంఘటనల గురించి స్టార్ హీరో మమ్ముట్టికి ఉన్న అవగాహనను ఆయన ప్రశంసించారు. కానీ ఆయన అసలు ఆ స్కామ్ ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు. దీంతో అసలు ఈ మూవీ అంతగా పాపులర్ అయిన ఏ స్కామ్ ఆధారంగా తెరకెక్కింది అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం మమ్ముట్టి ఫ్యాన్స్ రియల్ లైఫ్ లో జరిగిన ఆ స్కామ్ ఏంటో గెస్ చేసే పనిలో పడ్డారు.
టర్బోతో సునీల్ మాలీవుడ్ ఎంట్రీ
టర్బో అనేది యాక్షన్ కామెడీ చిత్రం. దీనికి వైశాఖ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పోక్కిరి రాజా, మధుర రాజా తర్వాత మమ్ముట్టి, వైశాఖ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ మూవీ. ఈ చిత్రానికి మిధున్ మాన్యువల్ థామస్ రచయిత కాగా, అంజలి జయప్రకాష్, శబరీష్ వర్మ, బిందు పనికర్, దిలీష్ పోతేన్ తో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటించారు. టర్బో విలన్గా నటించిన కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి నటించగా, అలాగే ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో తెలుగు నటుడు సునీల్ కన్పించాడు. ఈ మూవీతోనే సునీల్ మలయాళంలోకి అడుగు పెట్టాడు. మమ్ముట్టి హీరోగానే కాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్ మమ్ముట్టి కంపెనీ క్రింద ప్రాజెక్ట్ను నిర్మించారు. క్రిస్టో జేవియర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.