“గుణశేఖర్” ఈ పేరు వినగానే ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. ఎన్టీఆర్ తో రామాయణం లాంటి పౌరాణిక చిత్రాన్ని తీసిన గుణశేఖర్ చిరంజీవి, మహేష్ బాబుకి కమర్షియల్ హిట్స్ కూడా అందించి తన సత్తా చాటుకున్నాడు. భారీ సెట్స్ గుణశేఖర్ సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఒకప్పుడు వరుస హిట్స్ తో టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన ఈ సీనియర్ డైరెక్టర్, ఇటీవలి కాలంలో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ మధ్య అనుష్క ప్రధాన పాత్రలో భారీ వ్యయంతో రుద్రమదేవి సినిమా తీసినప్పటికి ఆశించిన హిట్ అందుకోలేకపోయారు.
ప్రస్తుతం సమంత లీడ్ రోల్ లో స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తూ శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు గుణశేఖర్. వివరాల్లోకి వెళితే, శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరం ఉన్నా లేకపోయినా భారీ సెట్స్ వేయిస్తుంటానని తనపై ఉన్న అపవాదు గురించి స్పందించాడు. ఒక్కడు సినిమా కోసం చార్మినార్ పరిసరాల్లో షూట్ చేసే పరిస్థితి ఆ రోజుల్లో పాతబస్తీలో ఉండేది కాదని, ఒకవేళ పోలీస్ పర్మిషన్ తీసుకున్నా కూడా చార్మినార్ చుట్టుపక్కల నివసించే వంద కుటుంబాల నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, అది అసాధ్యం కాబట్టి సెట్ వేయించాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో తన కెరీర్ లో హిట్లతో పాటు ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, సరైన కథతో వెళ్తే చిరంజీవి మహేష్ బాబు ఇప్పుడు కూడా సినిమా చేయటానికి సిద్ధంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. తాను కథపై ఎంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడతానో హీరోలందరికీ తెలుసని, అందుకే ఇప్పటికి వారు తనపై నమ్మకంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నంత మాత్రాన గుణశేఖర్ లాంటి సీనియర్ డైరెక్టర్ ప్రతిభని తప్పు పట్టలేం. హిట్ తప్పనిసరైన పరిస్తుతుల్లో లేడీ సూపర్ స్టార్ సమంతతో శాకుంతలం లాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథతో వస్తున్న గుణశేఖర్ కి ఈ సినిమా అయినా సక్సెస్ అందించాలని ఆశిద్దాం.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News