టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. ఈయన సినిమాలు వస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తుంటారు. దిల్ రాజుకి మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. దిల్ రాజు ఏదైనా సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ యజమానులు దానిని కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. చివరగా ఎఫ్3 సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా వచ్చే సంక్రాంతికి విజయ్ దళపతి- వంశీ పైడి పల్లి కాంబోలో వస్తున్న వారసుడు చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వారసుడు చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ తనకే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇస్తారని దిల్ రాజు భావించారట. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాలను దిల్ రాజుకు ఇవ్వకుండా సొంతంగానే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో దిల్ రాజు ఒక్కసారిగా షాక్కి గురయ్యాడట. దిల్ రాజుకి పోటీగా మైత్రి మూవీస్ వారు భవిష్యత్ లో ఇతర సినిమాలను రిలీజ్ చేసి తనకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాడట.
మరోవైపు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి రెండు సినిమాలు కలిపి నైజాం ఏరియాకి రూ.35 కోట్లకి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ కొనుగోలు చేయడం విశేషం. ఈ విషయం తెలిసిన దిల్ రాజు విజయ్ వారసుడు సినిమా కోసం కొన్ని ప్రధాన థియేటర్లను ఇప్పటికే బుక్ చేశాడట. హైదరాబాద్ తో పాటు విశాఖపట్టణంలో ఉన్నటువంటి ఫేమస్ థియేటర్లలో వారసుడు సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ వేశాడట దిల్ రాజు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమా విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ని పీఎస్ 1 సినిమాకి కేటాయించారు. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోక్యం చేసుకుని దేవి థియేటర్ ని పీఎస్ 1కి, సుదర్శన్ థియేటర్ ని గాడ్ ఫాదర్ కి కేటాయించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది అప్పటి వరకు వేచి చూడాలి.