గురజాడ అప్పారావు రచించిన సుప్రసిద్ధ నాటకం ‘కన్యాశుల్కం’ త్వరలో వెబ్ సిరీస్గా మన ముందుకు రాబోతుంది. తెలుగునాట మాత్రమే కాదు.. తెలుగువారు ఉన్న ప్రతి చోటఆ నాటకాన్ని ప్రదర్శించారు. వందలు కాదు వేల ప్రదర్శనలకు నోచుకున్న మహోన్నత నాటకం ‘కన్యాశుల్కం’. ఈ నాటకం ఆధారంగా 1955లో అదే పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు పి. పుల్లయ్య.
ఆ చిత్రంలో మధురవాణిగా సావిత్రి, గిరీశంగా ఎన్టీఆర్ ప్రదర్శించిన అజరామర నటన ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. సీఎస్ఆర్ ఆంజనేయులు (రామప్ప పంతులు), గోవిందరాజుల సుబ్బారావు( లుబ్దావధాన్లు), గుమ్మడి (సౌజన్యా రావు), షావుకారు జానకి (బుచ్చమ్మ), ఛాయాదేవి (పూటకూళ్లమ్మ), సూర్యకాంతం (మీనాక్షి), కుందు (వెంకటేశం), ప్రదర్శించారు. అయితే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మరీ స్వేచ్ఛ తీసుకొని సినిమా కోసం మార్చేశారనే విమర్శలకు తావిచ్చింది ఆ చిత్రం.
ఇక తర్వాత మరో సినిమా ఏదీ ఆ నాటకం ఆధారంగా రాలేదు. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఆ నాటకాన్ని వెబ్ సిరీస్గా నిర్మిస్తున్నాడు. ఇందులో గిరీశం పాత్రలో అవసరాల శ్రీనివాస్, రామప్పంతులు పాత్రలో సాయికుమార్ నటిస్తున్నారు. ఇక నాటకానికి ఆయువుపట్టు లాంటి మధురవాణి పాత్రను ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో సీతగా మనల్ని అలరించిన అంజలి చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హాస్యనటులుగా పేరుపొందిన పలువురు ఈ సిరీస్లో కనువిందు చేయనున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది.