“మగువా మగువా… లోకానికి తెలుసా నీ విలువా.. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా… నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా” అంటూ మహిళల గొప్పదనాన్ని సీతారామ జోగయ్య శాస్త్రి సిద్ శ్రీరామ్ వాయిస్ తో అద్భుతంగా చెప్పించాడు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాటను కచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో స్త్రీల ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలియ చెప్పిన కొన్ని టాలీవుడ్ సినిమాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం.
1. అమ్మ రాజీనామా
దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1991లో తెరపైకి వచ్చిన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం, పిల్లల కోసమే కష్టపడే తల్లి విలువను వారసులు గుర్తించకపోతే ఏమవుతుంది? ఆ నేపథ్యంలో తల్లి తన బాధ్యతలు పక్కన పెట్టేస్తే జరిగే పరిణామాలు ఏంటి? అనే కథతో రూపొందిన మూవీ అమ్మ రాజీనామా. మహిళల జీవితమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ మూవీలో “ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం” అనే పాట ఎవర్గ్రీన్ ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లే లిస్ట్ లో ఉంటుంది.
2. పవిత్ర బంధం
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా రూపొందిన మూవీ పవిత్ర బంధం. పెళ్లి విశిష్టతను, ఆడదాని గొప్పదనాన్ని తెలియజేసిన ఈ మూవీలో మనిషి జీవితంలో మహిళల పాత్ర గురించి గొప్పగా వివరించారు. ముఖ్యంగా “కార్యేషు దాసి” సాంగ్ వింటే చాలు ఒక్కసారి మహిళల గొప్పదనం ఏంటో బాగా అర్థమవుతుంది. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇప్పటికీ “పవిత్ర బంధం” మూవీ వస్తుంది అంటే టీవీలకు అతుక్కుపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
3. వకీల్ సాబ్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన రీమేక్ మూవీ వకీల్ సాబ్. ఈ మూవీలో తమకు జరిగిన అన్యాయానికి న్యాయాన్ని కోరుతూ ముగ్గురు అమ్మాయిలు జరిపే పోరాటాన్ని ఇంట్రెస్టింగా చూపించారు. ముఖ్యంగా “మగువా మగువా” అనే పాటలో స్త్రీ ఔన్నత్యాన్ని అద్భుతంగా వివరించారు. సిద్ శ్రీరామ్ వాయిస్ ఆ పాటను మరింత మధురంగా చేసింది. లిరిసిస్ట్ సీతారామజోగయ్య శాస్త్రి ఈ పాటకు అందించిన లిరిక్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
4. మాతృదేవోభవ
ఎవర్ గ్రీన్ మదర్ సెంటిమెంట్ మూవీ అనగానే ముందుగా గుర్తొచ్చేది మాతృదేవోభవ. 1993లో రిలీజ్ అయిన ఈ మూవీకి అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. భర్త చనిపోతే కోలుకోలేని రోగం బారిన పడిన భార్య జీవితాన్ని ఎలా ముగించింది? తన పిల్లల బాగు కోసం ఏం త్యాగం చేసింది అనే కథను హృద్యంగా చిత్రీకరించారు. ఈ మూవీని చూస్తే కన్నీళ్లు ఆగవు.
5. రుద్రమదేవి
కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి కథ ఆధారంగా 2015లో రిలీజ్ అయిన మూవీ రుద్రమదేవి. ఈ మూవీలో అనుష్క టైటిల్ రోల్ లో కనిపించగా, రానా, అల్లు అర్జున్, నిత్యామీనన్, కేథరిన్ తెరిసా ప్రధాన పాత్రలు పోషించారు. గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో రుద్రమదేవి శౌర్య పరాక్రమాలు ఎలా ఉండేవి అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.
6. మహానటి
దివంగత తెలుగు నటి సావిత్రి బయోపిక్ ఇది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చిన విధానం అద్భుతం. ఇక సినిమాలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే సావిత్రమ్మ జీవితాన్ని ఉమెన్స్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే.
Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.