రచయిత నుండి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, ఇతర దర్శకుల చిత్రాలకు రాయడం తగ్గించాడు. ఇప్పటికి చాలామంది ప్రేక్షకులు త్రివిక్రమ్ లోని దర్శకుడు కంటే రచయితకు ఎక్కువ మార్కులు వేస్తారు.
త్రివిక్రమ్ తన రచనతో సినిమాను డామినేట్ చేస్తాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరిగింది. చాలా మంది త్రివిక్రమ్ సినిమా అని అనుకున్నారు. మేకర్స్ కూడా త్రివిక్రమ్ పేరుని ఉపయోగించి సినిమాను ప్రమోట్ చేశారు. సాగర్ దర్శకత్వం కంటే త్రివిక్రమ్ రచనకే ఎక్కువ క్రెడిట్స్ వచ్చాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ చిత్రం “వినోదయ సీతమ్” రీమేక్ కు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఒరిజినల్కి దర్శకత్వం వహించిన సముథ్రఖని ఈ రీమేక్కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. పవన్ దేవుడిగా నటిస్తుండగా, సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా ఉండబోతున్నట్లు, తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మార్పులను సముథ్రఖని అంగీకరిస్తాడా లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.
సముథ్రఖని, సాగర్ కె చంద్రలా అనుభవం తక్కువున్నా దర్శకుడు కాదు, నిరూపించబడిన దర్శకుడు. కాబట్టి, అతని కథను ఇతర వ్యక్తులు మార్చినప్పుడు అతని అహం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మరి సముథ్రఖని త్రివిక్రమ్ అధిపత్యానికి ఒప్పుకుంటాడా.? లేక తన విజన్ని అనుసరిస్తాడా అనేది చూడాలి.