పవన్ కళ్యాణ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం అటు మెగా అభిమానులు, ఇటు ప్రేక్షకులు చాలా కాలం నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ కాంబినేషన్ ను ఇప్పటివరకు సెట్ కాలేకపోయింది. స్టార్ హీరోలను తన పైత్యంతో ఇబ్బంది పెట్టలేను అంటూ రాజమౌళి కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న నేపథ్యంలో పవన్ తో కూడా సినిమా ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర కూడా ఒకరు.
పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఓ కథని సిద్ధం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ స్ఫూర్తితోనే రాసుకున్నట్టు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ‘విక్రమార్కుడు’ కథని కూడా పవన్ కళ్యాణ్ కోసమే చేసినట్టు కూడా ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన కథను ఇతర డైరెక్టర్లకు ఇచ్చే ప్రసక్తే లేదని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. రాజమౌళి చేతనే తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన బలంగా చెబుతున్నారు. దీంతో రాజమౌళి-పవన్ కాంబో త్వరలోనే వచ్చే అవకాశముందని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.