‘భారతీయుడు'(తమిళ్ లో ఇండియన్) ఈ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. 1996లో విడుదలైన ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసి క్లాసిక్ గా నిలిచింది. కమల్ హాసన్ నట విశ్వరూపానికి, శంకర్ టేకింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత శంకర్ – కమల్ కాంబినేషన్ లో సినిమా రాలేదు. చాలా కాలానికి అంటే 2019 లో వీరి కాంబినేషన్ లో `భారతీయుడు 2` మొదలైంది. కాజల్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతొ కొంతమంది మరణించారు. ఈ ఘటన తర్వాత నిర్మాతలకు, దర్శకుడు శంకర్ కు మధ్య వివాదాలు తలెత్తాయి.
దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజా గా శంకర్.. రాంచరణ్ తో సినిమా స్టార్ట్ చేశాడు. దీంతో ’భారతీయుడు 2’ ప్రాజెక్టు నుండి శంకర్ తప్పుకున్నట్టు, కమల్ హాసన్ ఏ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నట్టు కోలీవుడ్ లో గుస గుసలు వినిపించాయి. ఈ వార్తలపై కమల్ హాసన్.. తాజాగా ‘విక్రమ్’ ప్రమోషన్లలో భాగంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘భారతీయుడు 2’ చిత్రానికి నేను దర్శకత్వం వహించడం లేదు. శంకరే దర్శకత్వం వహిస్తారు. అయితే ప్రస్తుతం ఆయన వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే .. ‘భారతీయుడు’ షూటింగ్ జరుగుతుంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసి అభిమానులను అలరించాలి అని చూస్తున్నాను. డైరెక్షన్ చేసే పని పెట్టుకుంటే అది కుదరదు” అంటూ కమల్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న వార్తలకు బ్రేకులు పడ్డాయి.