Cannes 2024 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొట్ట మొదటి భారతీయ నటిగా అనసూయ సేన్గుప్తా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. 77వ ఫెస్టివల్లో భారతీయ సినిమాకు ఇదొక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక వెబ్సైట్ మే 25న అన్ సెర్టైన్ రిగార్డ్లో విజేతలను ప్రకటించింది.
చరిత్రను సృష్టించిన అనసూయ
శ్యామ్ బెనెగల్ టైమ్లెస్ క్లాసిక్ మంథన్ ప్రత్యేక ప్రదర్శన నుండి రెడ్ కార్పెట్పై ప్రముఖులు, ప్రభావశీలుల అబ్బురపరిచే పర్ఫార్మెన్స్ వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈసారి భారతీయ సహకారాలతో సందడి చేసింది. అయితే ది షేమ్లెస్లో అనసూయ అద్భుతమైన నటన నిజంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించి, రాసిన మూవీ ది షేమ్లెస్. రేణుక సెక్స్ వర్కర్ల సంఘంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అందులోనే చిక్కుకున్న యువతి దేవికతో అసంభవమైన బంధాన్ని ఏర్పరుచుకోవడం.. ఢిల్లీ వేశ్యాగృహం నుండి పారిపోయిన అనసూయ ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎవరిని ప్రేమించింది? చివరకు ప్రియురాలిని కలుసుకుందా? వాళ్లిద్దరికి స్వేచ్చ దొరికిందా? అనేది ఈ మూవీ స్టోరీ. ఆమె పాత్రతో పాటు నటన కూడా ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఏకగ్రీవంగా అనసూయకు ఉత్తమ నటిగా గౌరవనీయమైన అన్ సెర్టైన్ రిగార్డ్ ప్రైజ్ లభించింది.
అవార్డును వాళ్ళకే అంకితం ఇచ్చిన అనసూయ
‘కేన్స్ 2024’ విజయంతో అనసూయ చరిత్ర సృష్టించింది. నిజానికి ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలు ఆమె కావడంతో అనసూయ పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అనసూయ ఈ అవార్డు గురించి మాట్లాడుతూ తన చిత్రం ‘ది షేమ్లెస్’ ‘కేన్స్ 2024’లో ఎంపికైనట్లు వార్తలు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తనకు నిర్మాతే చెప్పారని వెల్లడించింది. అనసూయ తన అవార్డును గే కమ్యూనిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కమ్యూనిటీలు పోరాడకూడని యుద్ధంలో ధైర్యంగా పోరాడినందుకు అంకితం చేసింది.
అనసూయ మాట్లాడుతూ “సమానత్వం కోసం పోరాడటానికి మీరు స్వలింగ సంపర్కులు మాత్రమే కానవసరం లేదు. వాళ్ళను కావాలని పక్కన పెట్టడం దయనీయం. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మీరు అలాంటి సమాజానికి చెందినవారు కానవసరం లేదు. మనం చాలా మంచి మనుషులుగా ఉండాలి” అని అన్నారు.
అనసూయ నటి కాదు
ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్న అనసూయ ముంబైలో ఒక ప్రొఫెషనల్ ప్రొడక్షన్ డిజైనర్. ప్రస్తుతం ఆమె గోవాలో నివసిస్తున్నారు. మసాబా గుప్తా, నీనా గుప్తా నటించిన నెట్ఫ్లిక్స్ షో ‘మసాబా మసబా’కి సెట్ డిజైనర్గా వర్క్ చేశారు అనసూయ. వాస్తవానికి ఆమె కోల్కతాకు చెందినది. జాదవ్ పూర్ తన చదువును పూర్తి చేసింది. ఇక ఇప్పుడు నటిగా కూడా ఆమెకు అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారతీయుల చూపు ఆ సినిమాపైనే..
ఇప్పుడు అందరి దృష్టి పాయల్ కపాడియా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే మూవీపై ఉంది. మూడు దశాబ్దాల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో స్థానం దక్కించుకున్న మొదటి భారతీయ చిత్రం ఇదే.