Akkineni Family : తెలుగు చిత్ర పరిశ్రమ లో అక్కినేని వంశ వృక్షంలో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సమకాలికుడిగా అగ్ర కథానాయకుడిగా ఏఎన్నార్ ప్రయాణం అనన్య సామాన్యమైనది. స్వయంకృషితో గొప్ప విలువలతో ఎదిగిన స్టార్ గా ఆయనకు గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆ రోజుల్లోనే అక్కినేని అందగాడిగా, నట సామ్రాట్ గా ఆయనకు ప్రత్యేకించి మహిళా ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన నటవారసుడిగా రెండో తరంలో తనయుడు అక్కినేని నాగార్జున సినీపరిశ్రమలో అగ్ర హీరో హోదాను అందుకున్నారు. అక్కినేని లెగసీని విజయవంతంగా ముందుకు నడిపించిన కింగ్ నాగార్జున ఇప్పటికీ తన సినిమాలతో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇక ఆ తర్వాతి తరంలో.. అంటే అక్కినేని కుటుంబంలో మూడో తరం హీరోలుగా నలుగురు హీరోలు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వారిలో అక్కినేని నాగార్జున తనయులు యువహీరోల్లో లీడ్ లో ఉన్న హీరోల్లో నాగచైతన్య, అఖిల్ తో పాటు, సుమంత్ , సుశాంత్ కూడా ఉన్నారు.
అక్కినేని వారసురాలు కూడా..
ఇక అక్కినేని వంశంలో(Akkineni Family) సుమంత్, సుశాంత్ ఇద్దరూ అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెల వారసులు. ఏఎన్నార్ పెద్ద కుమార్తె సత్యవతి అక్కినేని- సురేంద్ర యార్లగడ్డ దంపతుల ఏకైక కుమారుడు హీరో సుమంత్. అతను పుట్టిన కొన్ని నెలల తర్వాత, సుమంత్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లగా, సుమంత్ తన తాత గారి చెంతే ఉండి పరిశ్రమలో మంచి నటుడిగా కొనసాగుతున్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మరో కుమార్తె నాగ సుశీల కుమారుడు సుశాంత్. సుమంత్, సుశాంత్ ఇద్దరూ హీరోలుగా కొనసాగుతున్నారు. కెరీర్ పరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. అలాగే అక్కినేని వారసురాలు సుమంత్ సోదరి సుప్రియ కూడా ఉన్నారు. ఈమె ఇప్పుడు నటిగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారు.
వారసులంతా ఒకే ఫ్రేమ్ లో..
ఇక తాజాగా అక్కినేని (Akkineni Family) హీరోల స్పెషల్ ఫోటోగ్రాఫ్ లో దర్శనమిచ్చారు. ఆ ఫ్రేమ్ లో సుశాంత్ ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. అలాగే సుమంత్ సోదరి ప్రముఖ నిర్మాత సుప్రియ, వారితో పాటు కజిన్స్ కూడా ఉన్నారు. ఈ ఫ్రేమ్ లో నాగ చైతన్య, అఖిల్ సహా అక్కినేని యువ హీరోలంతా ఉన్నారు. అక్కినేని యువహీరోలంతా ఒకే ఫ్రేమ్ లో ప్రత్యక్షమవ్వడం రేర్ అనే చెప్పాలి. ఇది హ్యాపీ మూవ్ మెంట్. నాగార్జున కూడా ఉండి ఉంటే ఫ్యామిలీ మొత్తం నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండేది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో `తండేల్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక సుమంత్ మహేంద్రగిరి వారాహి అనే చిత్రంలో నటిస్తున్నారు. అఖిల్ తదుపరి యంగ్ డైరెక్టర్ తో పని చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ లో ఇప్పుడు నాగచైతన్య ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందని చాలా మంది అభిప్రాయం.