టాలీవుడ్ అయినా, కోలీవుడ్, బాలీవుడ్ అయినా అందరి చూపు ఒక్కటే. మల్టీ స్టారర్. హీరోలు, దర్శక నిర్మాతలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒక హీరోతో సినిమా చేస్తే, హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. కానీ ఒకరి కంటే ఎక్కువ మంది హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే, ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. నిర్మాతలకు మంచి లాభాలు వస్తున్నాయి.
ఈ ఫార్ములా ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఎఫ్3 తో పాటు ఇటీవల కోలీవుడ్ లో వచ్చిన విక్రమ్ సినిమాతో ప్రూవ్ అయింది. దీంతో సినిమాల్లో రెగ్యూలర్ హీరోతో పాటు అతిథి పాత్ర కోసమైనా, మరో హీరో ఉండేలా చేస్తున్నారు. కొంత మంది అయితే డైరెక్ట్ మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం కొన్ని మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే మరి కొన్ని సినిమాలు రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ దిగ్గజ హీరోలు రజినీ కాంత్, కమల్ హాసన్ కలిసి సినిమా చేయబోతున్నారని టాక్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మరో క్రేజీ మల్టీ స్టారర్ రాబోతుందని సమాచారం. అయితే ఈ సారి బాలీవుడ్ వంతు. బీ టౌన్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి సినిమా చేయబోతున్నారట. దీనికి ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం చేయబోతున్నట్టు టాక్. ఇప్పటి కే ఖాన్లకు మురుగదాస్ పవర్ ఫుల్ స్టోరీని చెప్పాడట. కథ నచ్చడంతో ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోలు ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించారు. మల్టీ స్టారర్ గా వస్తే, పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఉంటాయి.