అక్కినేని నట వారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ చాలా బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘NC22’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరు బంగార్రాజు సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
NC22 చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని, ఆ తరువాత కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటు అతని కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతం సమకూర్చడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మరోవైపు ఇటీవల ఈ చిత్రంలో నటించే నటీనటులందరిని దర్శకుడు పరిచయం చేసిన విషయం తెలిసిందే.
అందులో ముఖ్యంగా ప్రియమణి, ప్రేమి విశ్వనాథ్ (వంటలక్క) ,వెన్నెల కిషోర్ వంటి తారాగానాన్ని పరిచయం చేశారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు గ్రహిత ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో, నాగచైతన్య ఓ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అదికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ప్రియమణి పాత్రపై మూవీ యూనిట్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.