Vijay Sethupathi : పాన్ ఇండియా రేంజ్ విలన్

పాన్ ఇండియా, ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అగ్ర హీరోల నుండి చిన్న హీరోల వరకు ఈ ట్యాగ్ ను సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. “బాహుబలి”తో ప్రభాస్, “పుష్ప” తో అల్లు అర్జున్, “ఆర్ఆర్ఆర్” తో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.

హీరోలే కాదు కమెడియన్లు, కొంత మంది నటులు కూడా ఈ ట్యాగ్ కోసం కష్టపడుతున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తనను తాను పాన్ ఇండియా రేంజ్ కమెడియన్ అని వెన్నెల కిషోర్ చెప్పుకున్నాడు.
ఇదిలా ఉండగా, ఓ నటుడు పాన్ ఇండియా రేంజ్ లో విలన్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆ నటుడు ఎవరో కాదు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పటికే, “మాస్టర్” “ఉప్పెన” “విక్రమ్” సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి, మంచి మార్కులు కొట్టేశాడు. పాత్ర ఏదైనా, వందకు వంద శాతం న్యాయం చేస్తానని నిరూపించాడు. నిజానికి విజయ్ నటనపై దర్శక నిర్మాతలకు నమ్మకం ఎక్కువే ఉంది. అందుకే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న “పుష్ప ది రూల్” సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక అయ్యాడు అని వినిపిస్తోంది.

- Advertisement -

ఇప్పటి వరకు ఈ మక్కల్ సెల్వన్ టాలీవుడ్, కోలీవుడ్ రేంజ్ లోనే విలన్ పాత్రలు చేశాడు. కానీ, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో విలన్ గా సత్తా చూపించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “జవాన్” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో షారుక్ ఖాన్ ను ఢీ కొట్టడానికి విజయ్ సేతుపతిని మేకర్స్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమను సౌత్ స్టార్స్ ఏలేస్తున్నారు. దీంతో విలన్ పాత్రకు సౌత్ నుండి ఓ స్టార్ హీరోను తీసుకోవాలని “జవాన్” మేకర్స్ భావించారట. ఇదే సమయంలో విక్రమ్ సినిమాలో విజయ్ సేతపతి నటనకు జవాన్ మేకర్స్ ఫిదా అయిపోయారట. దీంతో మరో ఆలోచన లేకుండా, విజయ్ ను ఫైనల్ చేశారని టాక్.
ఈ వార్త నిజమైతే, ఈ కోలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా రేంజ్ లో విలన్ గా మారడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు