టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులను, పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 16న కలువనున్నారు.
సెప్టెంబర్ 16న హైదరాబాద్లో పర్యటనలో భాగంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలవనున్నారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ తిరిగి న్యూఢిల్లీకి వెళ్లే ముందు కత్రియా హోటల్లో నిర్వహించే సంతాప సభలో కూడా పాల్గొననున్నారు. కేంద్ర విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి కృష్ణంరాజు కాకినాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలకు అప్పట్లో బీజేపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ నలుగురిలో కృష్ణంరాజు ఒకరు. ముఖ్యంగా 2000 సెప్టెంబర్ 30 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు కృష్ణంరాజు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రిగా 2000 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22 వరకు సేవలు అందించారు. కృష్ణంరాజు 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయమంత్రిగా పని చేశారు .